|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సౌందర్య పోషణ
ఉదయం రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్ను కళ్ళచుట్టూ రాస్తే బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయి.
ఎండవేడిని తట్టుకునేందుకు వాడే సన్స్క్రీన్ లోషన్ల వంటి వాటిని బయటికి వెళ్ళేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడండి.
ఎప్పుడూ తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకండి.
ఎవియన్స్, ఎవాన్ వంటి ఐ క్రీములు, జెల్లు వాడవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు పాటించినా కళ్ళకింద వలయాలు పోకపోతే చర్మ సౌందర్యానికి సంబంధించిన వైద్య నిపుణులను సంప్రదించాలి.
ఐ షాడో కలర్ మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే బ్రష్ ని ముందుగా నీటితో తడపాలి.
కంటికి వేసుకునే మేకప్లు రకరకాలుగా ఉంటాయి. వీటిలో ఏది మొదట ఏది తర్వాత వేసుకోవాలో తెలుసుకుంటుండాలి. కంటికి మొదట షాడో, తర్వాత మస్కారా వేసుకోవాలి.
కంటిరెప్పలు పొడవుగా అందంగా కనిపించాలంటే కళ్ళు తెరచి వాటిని బ్రష్తో పైకి దువ్వటం వల్ల ఒత్తుగా అందంగా కనిపించేందుకు వీలుంటుంది.
కనుబొమ్మలను బాగా వెలుతురు ఉన్న ప్రాంతంలో కూర్చొని షేప్ చేయించుకోవాలి.
కళ్లు మెరుస్తూ చురుగ్గా ఉండాలంటే పేరిన నెయ్యి రెండు బొట్లు కళ్లలో వేసుకోవాలి.
కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకోవాలి.
కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది.
కళ్ళకింద వలయాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని లేజర్ చికిత్స ద్వారా పాక్షికంగా తగ్గించుకోవచ్చు. ఈ చికిత్స తీసుకునే సమయంలో ముఖానికి ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి.
కళ్ళక్రింద ఏర్పడే నల్లని వలయాలు ఉంటే కమలాపండు రసంలో నాలుగు చుక్కల పాలు కలిపి కళ్ళక్రింద సున్నితంగా రాయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
గుండ్రంగా కోసిన దోసకాయ ముక్కలను కళ్లమీద పెట్టుకుని ఒక పదిహేను నిముషాలు ఉంచండి. ఇలా కొద్దిరోజులు చేస్తే కళ్లకింది ముడతలు, వలయాలు తగ్గుముఖం పడతాయి.
ముడతలు రావడానికి గల ముఖ్యమైన కారణాల్లో ఎండలో తిరగటం వలన అల్ట్రావయొలెట్ కిరణాల తాకిడికి గురవటం ఒకటి. ఎక్కువ సమయం ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు సన్స్క్రీన్ని తప్పకుండా వాడాలి. చర్మం పొడిబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్రవపదార్ధాలు ఎక్కువగా తాగాలి. కళ్లకింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి గాఢత తక్కువ కలిగిన సున్నితమైన సౌందర్య సాధనాలనే వాడాలి.
రాత్రి పూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ని కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి.
నయనాల అందం మరింత ద్విగుణీకృతం చేసే మస్కారాను విడుదల చేసింది. మాక్స్ ఫ్యాక్టర్, దీనికి థెర్మో ప్లాస్టిక్ ఎలాస్టామర్ ఐఎఫ్తో రూపొందించిన బ్రష్ యొక్క ప్రత్యేక ఆకర్షణ కళ్ళపై ముద్దల్లా ఏర్పడకపోవడమే కాదు. ఎటువంటి హాని చేయదు. ఈ మస్కారా అన్ని సందర్భాల్లో ధరించేలా దీనిని రూపొందించామని, ఇది దేశవ్యాప్తంగా లభిస్తుందని తయారీదారులు తెలిపారు.
నిద్రలేమి, ఒత్తిడి, అలసట మూలంగా కంటి చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను ఇలాంటి చిన్ని చిట్కాలతో తొలగించుకోవచ్చు.
బాదం కలిసిన క్రీమ్ను కంటిచుట్టూ మెల్లగా మసాజ్ చేయాలి.
బంగళాదుంప రసాన్ని పట్టించి, తర్వాత దూదితో తుడవండి.
టీ డికాక్షన్లో ముంచిన ఐసుక్యూబ్లను కళ్లమీద పెట్టినా ఫలితం ఉంటుంది.
పచ్చిపాలను కంటిచుట్టూ మర్ధన చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
రోజ్వాటర్లో ముంచిన దూదిని కళ్ళపై పెట్టుకుని 5 నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి.
నిద్రకు ఉపక్రమించే ముందు కీరదోస రసాన్ని కంటిచుట్టూ పట్టించినా చాలు.
టమోటా గుజ్జు, పసుపు, నిమ్మరసం, శనగపిండిని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్లచుట్టూ రాసుకుని ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి.
చూశారుగా ఈ చిట్కాలన్నీ 5, 10 నిముషాలు మించి పాటించనవసరంలేదు. పైగా, వస్తువులన్నీ కూడా ఇంట్లో ఉండేవే. అయితే క్రమం తప్పకుండా చేస్తేనే ఫలితం ఉంటుంది.
కళ్లకూ ఆహారం!
కళ్లు, కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలతో కూడిన సమతుల ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకు పునాది గర్భస్థ శిశుదశలోనే పడాలి. అందుకే గర్భిణులు ఇతర పోషకాలతోపాటు డి.హ్చ్.ఎ. ( డొకొసా హెక్సానిక్ యాసిడ్ ) అనే ఫ్యాటీయాసిడ్ పుష్కలంగా అందేలా చూసుకోవాలి. అంతేకాదు ఏడాది దాటిన పిల్లలకు కూడా ఈ ఫ్యాటీయాసిడ్ సమృద్ధిగా అందివ్వాలి. కోడిగుడ్లు, బాదం లాంటి ఎండు గింజల్లోని పప్పులు, సోయా, అవిస గింజలు, చేపలు, చేప నూనెలు, వెజిటబుల్ నూనెలు తదితరాల ద్వారా ఈ ఫ్యాటియాసిడ్ విరివిగా లభిస్తుంది. డి.హ్చ్.ఎ. అందడానికి తల్లి పాలు కూడా చక్కని ప్రత్యామ్నాయమే.
[ వెనుకకు ]
ఆరంజ్ తొక్కల పొడికి కొద్దిగా ఉప్పు కలిపి దాంతో పళ్ళు తోముకుంటే ముత్యాల్లాగా మెరుస్తాయి.
ఉల్లిపాయను మెత్తగా నూరి చిగుళ్ళకు, పళ్ళకు మర్ధనా చేస్తే చిగుళ్ళ వ్యాధులు పోతాయి.
ఎక్కువ సేపు లిప్ స్టిక్ నిలిచి ఉండాలంటే రెండు సార్లు లిప్ స్టిక్ వేసుకుంటే సరి! ఒకసారి వేసుకున్నాక టిష్యూపేపర్తో మృదువుగా అద్దాలి. తర్వాత మరో సారి వేసుకోవాలి.
ఎప్పుడు లిప్స్టిక్ వేసుకున్నా పడుకునేముందు, దాన్ని తొలగించి, పడుకోవడం మరచిపోకండి.
గ్లిజరిన్ నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.
తేనె నిమ్మరసాల మిశ్రమాన్ని పెదవులకు రాస్తే పెదవుల నలుపు పోతుంది.
నొప్పిగా ఉన్న పంటిమీద చిన్న ఇంగువ ముక్కని వుంచితే ఫలితముంటుంది.
పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండాలంటే వారానికోసారి టేబుల్ సాల్ట్ తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి.
పెదాలవల్ల మనకు ఏ ఇబ్బంది రాకుండా వుండాలంటే రోజూ రాత్రిపడుకునే ముందు మీగడగానీ, వెన్నగానీ, వేజలైన్ గానీ, రాసుకుంటూ వుండాలి.
పెదాలు నల్లగా వున్నవారు రాత్రిళ్ళు పడుకునేముందు బీట్రూట్ రసం రాసుకుంటే మంచిది. పెదాలు ఎర్రగా మారుతాయి.
పెదాలు పగిలితే తేనెలో వెన్న కలిపి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
బాదంపప్పు నూరి పడుకునే ముందు పెదాలపై మర్దనా చేసుకుంటే మంచిది.
లిప్స్టిక్ వేసుకునే ముందు వేజలైన్ రాసి, దానిమీద లిప్స్టిక్ వేసుకుంటే పెదాలు పగలకుండా వుంటాయి.
లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్లైనర్ వాడండి. దీనివల్ల లిప్స్టిక్ అటూ, ఇటూ అయినా మూతిచుట్టూ పరచుకోకుండా ఉంటుంది.
లిప్స్టిక్, వేజలైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించుకుంటాయి.
లిప్స్టిక్ను బ్రష్తో వేసుకోవడం ద్వారా ఆదా చేయవచ్చు.
సహజమైన సన్ బ్లాక్ ఉన్న లిప్ బాం పెదవులకు వాడాలి.
చలి కాలంలో పెదవులు పొడిబారి చాలా ఇబ్బంది పెడతాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మృదువైన పెదాలు మీ సొoతమవుతాయి.
- పెదవులు తడారిపోతే చాలా మంది నాలుకతో తడి చేసుకుంటారు. పొడిబారిన చర్మాన్ని మునిపంటితో కొరకడం కూడా చూస్తుంటాం. దీని వల్ల పెదాలు మరింతగా పొడిబారి చికాకు పెడతాయి.
- పగిలిన పెదవులకు తరచూ పెట్రోలియం జెల్లీ రాసి మృదువుగా మర్దన చేయండి. తర్వాత శుభ్రమైన తడి వస్త్రంతో కాస్త గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తే పెదవులపై మృతుకణాలు తొలగిపోతాయి.
- ఇప్పుడు మార్కెట్లో... బ్యూటపార్లర్లలో వాష్ క్లాత్ అని దొరుకుతుంది. ఇది ఒకరకంగా.. కాస్త బిరుసుగా ఉండే టర్కీటవల్ మాదిరిగా ఉంటుంది. దీనితో చర్మం పై మృతకణాలు ఇట్టే తొలిగిపోయి మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
- శీతాకాలంలో లిప్స్టిక్ అందరికీ పడకపోవచ్చు. లిప్స్టిక్ తప్పనిసరి అయితే కనీసం తొందరగానైనా తీసేయాలి. ఎందుకంటే అందులోని కొన్నిరకాల రసాయన పదార్ధాలు పెదవులను ఎండిపోయినట్లు చేస్తాయి.
- లిప్జెల్ పెదవులను సున్నితంగా ఉంచడమే కాదు... మెరుపునూ ఇస్తుంది.
[ వెనుకకు ]
గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి బుగ్గన ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.
తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
లవంగాన్ని చప్పరించటం వల్ల నోరు తాజాగా ఉంటుంది.
వాముని నలిపి, వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. కొంచెం వాముని నీటీలో వేసి మరిగించి తయారు చేసిన డికాషన్లో కాస్త ఉప్పు కలుపుకొని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
[ వెనుకకు ]
అందమైన, ఆరోగ్యమైన గోళ్ళు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. గోళ్ళ సంరక్షణకు కొన్ని టిప్స్ తెలుసుకుందాము.
గాఢమైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. దీనికి పరిష్కారం, గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయడం.
గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ, పుచ్చిపోకుండా ఉంటాయి.
గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్ని పూయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్తో మెల్లగా కత్తిరించాలి.
గోళ్ళకు నాణ్యమైన గోళ్ళ రంగునే వాడాలి, రంగు వేసుకొనేప్పుడు చర్మానికి అంటితే అలా వదిలేయవద్దు. వెంటనే దూదితో తుడిచేయాలి.
గోళ్ళకు రంగువేసుకునేటప్పుడు బేస్ కోట్, పాలిష్, టాప్ కోట్ వేసుకోవాలి. అప్పుడు గోళ్ళరంగు అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
గోళ్ళపై ముదురు రంగులు వేసుకుంటే కనీసం 45 నిముషాలు చేతులకు పని చెప్పకూడదు. లేత రంగులు వేసుకుంటే 25 నిముషాలు ఆరనిస్తే చాలు.
గోళ్ళరంగు వేయని సహజమైన గోళ్ళను పొడుగ్గా కనిపించేలా చేయడానికి ఒక చిట్కా ఉంది. తెల్లని నెయిల్ పెన్సిల్ని గోరు అంచుల వద్ద అడ్డంగా గీస్తే సరి.
గోళ్ళు మిల మిల మెరవడానికి నెయిల్ నరిషింగ్ క్రీం అని దొరుకుతుంది అది ఒక చుక్క గోరు మొదట్లో వేసి మెల్లగా మర్దన చేయాలి.
చాలామంది చేతివేళ్ళను అస్తమాటూ విరుస్తూ వుంటారు. అలా విరవడ కూడదు. దానివల్ల వేళ్ళలో పటుత్వం తగ్గిపోతుంది.
చిన్న గోళ్ళు పొడుగ్గా కనిపించాలంటే మెరుస్తుండే రంగులను గాని, మెటాలిక్ పెయింట్లను గాని వాడలి.
చేతులకు ఆయిల్తో మర్ధన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై చేతివేళ్ళు అందంగా తయారవుతాయి.
నీళ్ళలో ఎక్కువ సమయం పనిచేయవలసి వచ్చినప్పుడు చేతులకు రబ్బరు గ్లౌజ్లు వేసుకొంటే గోళ్ళు నీటిలో నానకుండా వుంటాయి.
నెయిల్పాలిష్ గడ్డకట్టిందా? రిమూవర్ తీసుకుని కొన్ని చుక్కలు అందులో వేసి కలిపితే మళ్లీ వాడుకోవచ్చు.
నెలలో కొద్ది రోజులు రంగు వేయకుండా గోళ్ళను అలాగే సహజంగా వదిలేయాలి.
బాగా తడిసి ఉన్నప్పుడు గోళ్ళను కత్తిరించే కార్యక్రమం పెట్టుకోవాలి. ఇలాగైతే విరగకుండా సులభంగా ఒక పద్దతి ప్రకారం కత్తిరించుకోవచ్చు.
మొదటి కోటింగ్ వేసిన తర్వాత పది నిమిషాలు ఆరనిచ్చి రెండవ కోట్ వేయాలి. టాప్ కోటింగ్ వేసేటప్పుడు కూడా గోళ్ళను పది నిమిషాలు ఆరనిచ్చి రెండవ కోట్ వేయాలి. టాప్ కోటింగ్ వేసేటప్పుడు కూడా గోళ్ళను పది నిముషాలు ఆరనివ్వాలి.
శీతాకాలంలో గోళ్ళను పొడవుగా పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఈకాలం గోళ్ళు త్వరగా విరిగిపోతాయి.
[ వెనుకకు ]
ఇంటి పని వంట పని తో గట్టిపడే అరచేతులకి కమలా రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి.
వంట, ఇంటి పనితో గట్టి పడిన చేతులకు బంగాళదుంపలు ఉడకపెట్టి ఆ గుజ్జును రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.
ఒక అరకప్పు ఆవనూనెని వేడి చేసి దానిని మోకాళ్ల మీద మృదువుగా మర్దనా చేస్తే జాయింట్ల నొప్పులు తగ్గుతాయి.
కూరగాయలు కోసేటప్పుడు చేతులకు మరకలయితే నిమ్మకాయ డిప్పతో రుద్దండి. మరకలు ఊరికేపోతాయి.
చేతి వేళ్ళకు అంటిన ఆహారపదార్ధాల తాలూకు మరకలు పోవాలంటే పచ్చి బంగాళదుంప ముక్కతో రుద్ది కడగాలి.
పసుపు, వెల్లుల్లి కలిపి నూరి అరిచేతులు, అరికాళ్ళకు రాస్తే కాళ్ళూ, చేతులు చల్లబడటం తగ్గుతుంది.
కొబ్బరి, ఆలివ్, సన్ఫ్లవర్, బాదం, నువ్వుల నూనెలను నాలుగు టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ ఈ నూనెను చేతులకు పట్టించి మర్దనా చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత నిమ్మచుక్కలు వేసిన నీటితో కడిగేసుకోవాలి.
శీతాకాలంలో చేతులు నల్లగా మారి పోతుంటాయి చాలా మందికి. మాయిశ్చరైజర్ రాసుకుంటున్నా కూడా ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ చిన్ని చిట్కా పాటించండి. చేతులు తెల్లగా మారి నిగారింపును సంతరించుకుంటాయి. సరిపడా నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించాలి. ఐదు నిమిషాలయ్యాక చేతులను ముందుగా వేడి నీటిలో ఆ తర్వాత చల్లని నీటిలో ముంచండి. కడిగి మెత్తటి తువ్వాలుతో చేతుల్ని తుడిచాక మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా రోజు విడిచి రోజు చేయండి మార్పు మీకే తలుస్తుంది.
[ వెనుకకు ]
అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
కాలేజీలకు స్కర్టులు వేసుకునే వారికి మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనె లో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.
కీరా జ్యూస్లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
క్యారెట్ తురుమునకు రెండు టేబుల్స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్లా వేయాలి.
టేబుల్స్పూన్ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.
నిమ్మరసం, పంచదార కలిపి మిశ్రమంతో ముందుగా పాదాలను శుభ్రపరచాలి. ఇది స్క్రబ్ లా పనిచేసి చర్మం పై పేరుకున్న మృతకణాలన్ని తొలగిపోతాయి. ఆ తర్వాత నాలుగు చెంచాల పాలు, తేనె, గోధుమపిండి ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా చేసి పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
నెయిల్ పాలిష్ వేసుకునే ముందు కాలి వేళ్ల మధ్య దూదిని గుండ్రంగా చేసి పెట్టుకుంటే నెయిల్ పాలిష్ అటూ ఇటూ అంటకుండా ఉంటుంది.
బొప్పాయి కాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకులా నూరి ఆ ముద్దని అరికాళ్ళు ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.
రెండు మగ్గిన టమోటాలు, 2 టేబుల్స్పూన్ల నువ్వులనూనె, టేబుల్స్పూన్ ఉప్పు తీసుకోవాలి. టమోటాను మిక్సీలో వేసి గుజ్జులా చేసుకుని దానికి నువ్వుల నూనె, ఉప్పు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతికి తడిచేసుకుని అదంతా చర్మంలోకి ఇంకేలా నలుగుపెట్టినట్లుగా మర్దన చేయాలి. గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
[ వెనుకకు ]
తేనె నిమ్మకాయ రసం కలిపి తాగినా లావుగా ఉన్నవారు సన్నబడతారు. అయితే ఎసిడిటి ఉండకూడదు.
బరువు తగ్గటానికి మందులేమి ఉండవు. పీచు పదార్దాలనే నిపుణులు బరువు తగ్గడానికి ఉపయోగపడే మ్యూజిక్పిల్స్ గా పేర్కొంటారు.
లావు కావాలనుకునేవారు రాత్రులు గ్లాసుడు గోరు వెచ్చని పాలల్లో స్పూను తేనె కలుపుకొని తాగాలి.
లావుగా ఉన్న వారు సన్నబడాలంటే ప్రతి నిత్యం లేత ములగాకు రసం తాగుతూ ఉండాలి.
సన్నబడాలనుకునే వాళ్ళు ఉదయానే పరగడుపున గ్లాసుడు గోరు వెచ్చని నీళ్ళలో స్పూను తేనె కలుపుకొని తాగాలి.
పదిలం సుమా!
సన్నజాజి తీగలా కనిపించడానికి డైటింగ్, వ్యాయామం తప్ప ఇంకేం చేయగలమంటూ ప్రశ్నిస్తుంటారు. ఇది కొంతవరకు మంచిదే కానీ అదే పనిగా చేస్తుంటే... ఫలితం మాట ఎలా ఉన్నా... ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బరువు తగ్గేముందు ఎన్నో రకాల విషయాలలో జాగ్రత్తలు వహించాలి. అవేంటంటే...
పరిమాణం కాదు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి. అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువ తినడం కన్నా ఆరోగ్యకమైనది, పరిశుభ్రమైనది, రుచికరమైనది మితంగా తీసుకున్నా చాలు. అందుకని ఫాస్ట్ఫుడ్ను కట్టి పెట్టండి. నిపుణుల సలహాతో సింపుల్గా, రుచికరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించండి .
ఖరీదు ఎక్కువైనా కూడా నాన్స్టిక్ పాన్స్ను కొనండి. నూనె వాడకం బాగా తగ్గుతుంది.
మార్కెట్లో దొరికే పలురకాల ఆహారపద్ధార్దాల ప్యాక్లపై 'తక్కువ కెలోరీలు' అని రాసి ఉంటాయి. దాన్ని చూసి మోసపోకండి. ఉదాహరణకు ఓ తీపి పదార్ధంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్నా తీపి అధికంగా ఉండవచ్చు, దీనివల్ల తీపి శాతం మన శరీరంలో చేరినట్లే కదా! ఏ విధంగా చూసినా అధిక కెలోరీలు తీసుకుంటున్నట్లే, అందుకని ఆహారం ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
వంటచేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వంటకాల్లో వేసే నూనెను తగ్గించడం, అధిక కొవ్వు ఉండే వెన్న, నెయ్యిని మితంగా వాడడం అలవాటు చేసుకోండి.
అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు రెండు బిస్కెట్లు, పెద్ద కప్పు చిప్స్ తినేస్తుంటారు చాలామంది. వీటికి ప్రత్యామ్నాయాలు ఎంచుకోండి. ఆకలేసినప్పుడు ఏదైనా ఓ పండు లేకపోతే తాజా కూరగాయలు తినడం ప్రారంభించండి.
ఫిట్నెస్ బంతి ఒకటి కొనిపెట్టుకోండి. టీవీ చూస్తున్నా లేక ఏదైనా పుస్తకం చదువుతున్నా కూడా దానిపై కూర్చొనేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.
లేదంటే సాధ్యమైనంతవరకు నడవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
[ వెనుకకు ]
తేనెతో కలిపి నిమ్మకాయ రసం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
దాహంగా అనిపించకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండాలి. అప్పుడే శరీరానికి అవసరమైన ద్రవపదార్ధాలు అందుతాయి. కూల్డ్రింకుల కన్నా కొబ్బరి నీరు, పండ్లరసాలు మంచిది.
పెరుగు రక్త ప్రవాహంలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది గుండెజబ్బు గలవారికి మంచిది.
పెరుగుపై ఉండే నీటి తేట ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కళ్ళకు చలవనిస్తుంది.
వేడి నీటిలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే జలుబు భారం తగ్గుతుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in